- సమష్టి కృషే అంతా.. దాతల సహకారం కొంత
- ముదిరాజ్ సంఘల ఆధ్వర్యంలో ఆలయం పూర్తి
- వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపనోత్సవాలు
- ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు
Peddamma Temple: సమష్టికృషితో పెద్దమ్మ ఆలయ నిర్మాణం చేసి పలువురి మన్ననలు పొందుతూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తు్న్నారు ముదిరాజ్ సంఘసభ్యులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ సింహ సేన యూత్ ఆధ్వర్యంలో గ్రామ శివారులోని వేములకుర్తి-బర్దిపూర్ ప్రధాన రహదారి ఎర్రబోడ ప్రాంతంలో దాదాపు 35 సంవత్సరాల నాటి పెద్దమ్మ ఆలయం పాతది ఉండగా అదే స్థలంలో ముదిరాజ్ సంఘాల పెద్ద మనుషులు సున్నం రమేశ్, రెడ్డవేన లక్ష్మీ నర్సయ్య, పల్లి శ్రీనివాస్, రెడ్డవేన రాజేష్ ఆధ్వర్యంలో నూతన ఆలయం నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించారు. సంవత్సరం వ్యవధిలోనే ఆలయ నిర్మాణం చేపట్టారు. నాలుగు సంఘాలకు చెందిన కుంటుంబీకులు ఆలయ నిర్మాణం కోసం ఇంటికి దాదాపు రూ.30 వేల చొప్పున జమచేసుకొని మరికొంత దాతల సహకారం తీసుకొని ఆలయ నిర్మాణం రూ.50 లక్షలు వరకు వెచ్చించి అమ్మవారి ఆలయం నిర్మాణం చేపట్టారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు గ్రామస్తులకు దర్శనార్థం అన్ని ఏర్పాటు చేశారు.
ఆలయం అద్భుతం
గణపతి, వారాహిమాత, చండప్రచండ, గాయిత్రి, కూష్మాండ, కురుక్షేత్ర సంఘమ రథం పైన వచ్చే కృష్ణా అర్జున, పంచ పాండవులు, రాముడు, సీత వనవాసంలో ఉన్న చిత్రం, పోతరాజు, ద్వార పాలకులు, పులులు, సింహాలు తమిళనాడు శిల్పిలు రూపొందించారు. వేములకుర్తి ఆర్టిస్ట్ కోటగిరి అశోక్ చిత్రాలకు రంగులు దిద్ది ప్రాణం పోశారు. ఆలయం పైన ఉన్న దేవతా ప్రతిమలను చూస్తే మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
రోజువారి కార్యక్రమాలు
26/08/2024 సోమవారం పెద్దమ్మతోపాటు పోతరాజు, భిమన్న విగ్రహాల గ్రామ ప్రదక్షిణ, ఆలయ ప్రవేశం, జలాదివాసం అనంతరం ధాన్యదివాసం పంచామృతాలతో శుద్ధి, పుణ్యహవచనం.
27/08/2024 మంగళవారం పుణ్యహవచనం, ఖానాపూర్ యజ్ఞ అర్చకులు చక్రపాణి నర్సంహమూర్తిచార్యులు, బండలింగాపూర్ గండిహన్మాన్ దేవాలయ అర్చకులు చక్రపాణి మాదవచార్యుల ఆధ్వర్యంలో యజ్ఞం అనంతరం, స్థాపిత దేవతామూర్తుల ఆరాదన, పంచామృతాలతో అభిషేకాలు.
28/08/2024 బుధవారం దేవాలయంలో యంత్ర ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. భక్తులకు అన్నదాన కార్యక్రమం.
29/08/2024 గురువారం బైండ్ల పూజారి రామడుగు నీలం మెగిలి ఆధ్వర్యంలో పోచమ్మ పండగలు నిర్వహిస్తున్నారు.
30/08/2024 శుక్రవారం అమ్మవారి కోసం గ్రామంలో ఇండ్లకు వెళ్ళి జోగి ఎత్తె కార్యక్రమం ఉంటుంది.
31/08/2024 శనివారం అమ్మవారికి బోనాలు, భీమన్న గధలు ఆలయం చేరడం, సుంకు కార్యక్రమాలు ఉంటాయి.
01/09/2024 అదివారం పెద్దతల్లి పట్నాలు, పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణ మహోత్సవం. తదనంతరం అమ్మవారి ఆలయ ప్రతిష్టప ముగింపు. పలువురికి సంభావన సత్కారాలు.
సమష్టి కృషితో ఆలయ నిర్మాణం : పెద్దమ్మ ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, సున్నం రమేశ్
ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం చేపట్టాం. ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు వచ్చేలా ఆలయ నిర్మాణం చేసి ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా ప్రతిష్టాపన చేస్తున్నాం. భక్తులు ఆయా గ్రామాల ప్రజలు ఇట్టి మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి.