ZPTC MPTC Elections Nirmal District: నిర్మల్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు సకాలంలో సమాచారం అందించేందుకు హెల్ప్డెస్క్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నామినేషన్ దాఖలు ప్రక్రియలో అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రతి రోజూ స్వీకరించిన పత్రాలను భద్రపరిచి, సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నామినేషన్లపై రోజువారీ నివేదికలను కలెక్టరేట్కు పంపాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ అరుణతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

