KTR
KTR

KTR: 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే మంత్రి చాంబర్ ముందు ధర్నా చేస్తా..: కేటీఆర్

  • సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ హెచ్చరిక
  • మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం
  • కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ పర్రెను రిపేర్ చేయకుండా రైతులను గోస పెడుతున్నారు
  • కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లోనూ చెరువులు మత్తడి దుంకినయి
  • ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 2 (మన బలగం): ఏసుకున్న పంట నీరు లేక ఎండిపోవడం తెలుసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవుని గుట్ట తండాలో మాజీ మంత్రి కేటీ రామారావు పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సాధక బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని అన్నారు. మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించి కేసీఆర్‌పై ఉన్న కోపం, ద్వేషంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయేలా రేవంత్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో సాగునీరు లేక వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు. సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్, ఇవాళ దేవునిగుట్ట తండాలో రైతులను కలిసి వారి సమస్యలను విన్నారు. సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను కేటీఆర్‌కు రైతులు వివరించారు. ఎండిన పంట పొలాలను కేటీఆర్‌కు చూపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తే, దేవునిగుట్ట తండాలో రైతులు సాగు చేసేవారు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వొచ్చు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎర్రటి ఎండల్లోనూ అప్పర్ మానేరు, మిడ్ మానేరు ద్వారా వాగులు, చెరువులు నింపి రైతులను కాపాడాం. ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చూస్తూ ఊరుకోం. 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే, మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తా’ అని కేటీఆర్ హెచ్చరించారు. ‘కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి. రైతులను గోస పెట్టొద్దు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదు. రైతు బంధును ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు.’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 1 టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్‌కు విడుదల చేస్తే ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయం చేయడానికి సరిపోతుంది. తాగునీటికి 3 టీఎంసీలు చాలు, ఇంకా 13 టీఎంసీలు మిగులుతాయి. తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ లేదు.’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులు గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలన్న కేటీఆర్, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతులను కాపాడాలన్నారు. సాగునీళ్లు విడుదల చేయకపోతే, అన్నదాతలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

KTR
KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *