- బీసీ కుల సంఘాలతో సీఎం చర్చలు జరపాలి
- బీసీల సంఖ్యను తగ్గించి లెక్కలు రాని రేవంతయ్యాడు
- రాజకీయ కక్షతో కాళేశ్వరం నీళ్లను ఆపేశాడు
- రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు
MLC Kavita: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 10 (మన బలగం): ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులాలకు తీరని అన్యాయం చేశాడని, 52 శాతం ఉన్న బీసీలను తగ్గించేశాడని, తిరిగి సాధించేందుకు మరో తెలంగాణ తరహా పోరాటానికి సిద్ధం కావాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు బోలెడు తేడావుందాన్నారు. కేసీఆర్ పాలన ఐ ఫోన్లా ఉంటే రేవంత్ పాలన చైనా ఫోన్ లాగా ఉందన్నారు. చైనా ఫోన్ చూడడానికి బాగుంటుందని, సరిగ్గా పనిచేయదని కవిత అన్నారు. కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనలో ఎంతో తేడా ఉందని ఏడాదిలోనే ప్రజలకు పరిచయం చేశాడని తెలిపారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీ కులాల 52 శాతంగా లెక్క తేల్చారన్నారు. ఇప్పుడేమో అంత 56 శాతం ఉన్న బీసీలను 46 శాతంగా చూపి బీసీలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు బీఆర్ఎస్ బీసీలకు అండగా ఉంటుందన్నారు. ఎన్నికల వేళ బీసీ కుల ఓట్ల కోసం మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ కులంలో ఎంత జనాభా ఉందో ఎందుకు బయట పెట్టడం లేదని కవిత ప్రశ్నించారు. బీసీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తుతూ మంత్రంగా సమావేశం జరిపాడని ముఖ్యమంత్రి ఇప్పటి వరకు బీసీ సంఘాల నేతలను సమావేశానికి పిలువలేదని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బీసీలను వంచించడమే పనిగా పెట్టుకొన్నారని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రికి బీసీలపై ప్రేమ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజలను మోసాగించడమే పనిగా పెట్టుకొన్న ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేయడని బీసీలంతా తెలంగాణ తరహా మరో పోరాటానికి సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను అమలుచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని కవిత ఆన్నారు.
కేసీఆర్పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును నిర్వీర్యం చేశాడని, కాళేశ్వరం నీళ్లను విడవక పంటలను ఎండపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంట పొలాలను చూస్తే కన్నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పిటికైనా రాజకీయ కక్షలను ముఖ్యమంత్రి పక్కన పెట్టి కాళేశ్వరం నీళ్లను విడిచిపెట్టాలని కోరారు. అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు రెండు వేల ఐదువందల పెన్షన్ ఇస్తామని మాటతప్పాడన్నారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి చిన్న చూపుగా మారిందని తగిన సమయంలో గుణపాఠం తప్పదని కవిత హెచ్చరించారు. ఎక్కడా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని అన్నారు. అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కవిత ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరాడని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని కవిత అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యం చెక్కు చెదరలేదని, ఇలాగే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత, రమణారావు తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.