Medical camp: నిర్మల్, మార్చి 10 (మన బలగం): ఆరోగ్యంపై మహిళలందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, అలాగే వారి సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వైద్య శిబిరం ఎంతో సహాయపడుతుందని కలెక్టర్ అన్నారు. బీపీ, కంటి, రక్తపరీక్షలు, వైద్య సేవలు అందించడం మహిళా ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో కీలకమైనవని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మహిళల సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వైద్యులు కలెక్టర్కు బీపీ, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మహిళా శక్తి క్యాంటీన్లో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీ స్టాల్ కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.రాజేందర్, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అశోక్ కుమార్, శంకరయ్య, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, డిసిఎచ్ఎస్ డా.బి.సురేష్, ఏవో సూర్యారావు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
