- యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ నీటి సరఫరా పనులు చేపట్టాలి
- తాగు నీటి సరఫరాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మార్చి 18 (మన బలగం): వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తాగు నీటి సరఫరా, సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా తాగు నీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ సోర్స్, సమస్యాత్మక ప్రాంతాలు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ తదితర అంశాలను కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో తక్కువగా తాగునీరు అందుతున్న గ్రామాలు, భూగర్భ జలాలు తగ్గడం వల్ల అధికంగా పైప్లైన్ నీటిపై ఆధార పడటం వంటి పలు కారణాలవల్ల నీటి ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను పకడ్బందీగా చేపట్టాలని, గ్రామాలలో వెంటనే చేపట్టాల్సిన చర్యల ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మిడ్ మానేర్, అప్పర్ మానేర్ నుంచి తాగు నీరు వేములవాడలోని గుర్రంవానిపల్లి 120 ఎం.ఎల్.డి, గంభీరావుపేట్ మండలంలోని కోలమడ్డి 7 ఎం.ఎల్.డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి 300 ఆవాసాలు (271 రూరల్, 29 అర్బన్) నీటి సరఫరా జరుగుతుందని అన్నారు. వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ తాగు నీటి సరఫరా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. జిల్లాలోని 75 జనావాసాలలో కొన్ని ప్రాంతాలలో తాగు నీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. మండలంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రైవేట్ పంప్, బోరు బావులను హైరింగ్కు తీసుకోవాలని అన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ స్థానికంగా ఇతర నేటి సరఫరా సోర్స్లను గుర్తించాలని అన్నారు.
ప్రతి మండలంలో తాగునీటి సరఫరా ఏ ఆవాసాలకు ఇబ్బంది అవుతుంది వివరాలు తెలుసుకొని, అక్కడ వేరే మార్గాల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సరఫరా లీకేజీలను ఎప్పటికప్పుడు అరి కట్టేలా చర్యలు తీసుకోవాలని, నీటి వృథాను నివారించాలని అన్నారు. సమస్యాత్మక ఆవాసాల పరిధిలో హ్యాండ్ పంపు, బోర్ బావులు వివరాలు సేకరించాలని అన్నారు. పబ్లిక్ వాటర్ సప్లై పరిధిలో మరమ్మతుకు గురైన పాత పంపుల మరమ్మతు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వేములవాడ సిరిసిల్ల పట్టణాలలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి అవసరమైన నీరు రాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు జానకి శేఖర్ రెడ్డి. డి.రాము ఏఈలు ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు సమ్మయ్య అన్వేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.