Union Minister Dharmendra Pradhan: ధర్మపురి, జనవరి 11 (మన బలగం): ధర్మపురి మండలం నేరెళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయాన్ని (Jawahar Navodaya Vidyalaya) ఇతర ప్రాంతానికి తరలించకుండా నేరెళ్లలోనే యథావిధిగా కొనసాగించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీలోని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan)ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్(MLA Adluri Laxman Kumar), ఎంపీ వంశీ క్రిష్ణ (MP Vamsi Krishna) కలిసి వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనలో భాగంగా నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం అన్ని విధివిధానాలను పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అధికారులకు అనేక అభ్యర్థనలు సమర్పించి, మార్గదర్శకాల ప్రకారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నేరెళ్ల గ్రామం వద్ద 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. రోడ్డు కనెక్టివిటీని గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధర్మపురికి చెందిన నేరెళ్లతో పాటు 18 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని తెలిపారు. ఎన్వీఎస్ నోటిఫికేషన్ తేదీ 2025 జనవరి 10 ప్రకారం, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నేరెళ్లతో సహా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదించినట్లు వెల్లడించారు. తదనుగుణంగా 2025 విద్యా సంవత్సరంలో పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలోని ధర్మపురి మండలం నేరెళ్లలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని సకాలంలో అమలు చేసేలా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కేంద్ర మంత్రిని కోరారు. దానిపైన వారు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.