- ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జాతర నిర్వహణ
- భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు రాకుండా ఏర్పాట్లు చేయాలి
- పారిశుధ్య నిర్వహణ అత్యంత ప్రాధాన్యతగా భావించాలి
- భద్రత అంశంలో పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలి
- మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో కలిసి రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్
Government Whip Adi Srinivas: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: మహా శివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్ , సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు.
ఫిబ్రవరి 26 న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మాహా జాతర ను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. గత మహా శివరాత్రి ఉత్సవాలకు 2 లక్షల 50 వేల మంది భక్తులు వచ్చారని, ఈసారి 4 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో జాతర ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నీడ, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు. జాతర సందర్భంగా మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి కార్మికులను డిప్యూట్ చేసుకొని జోన్ల వారీగా విభజించి పారిశుధ్య నిర్వహణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, పాలు అందించేలా దేవస్థాన సంస్థ ఏర్పాట్లు చేయాలని అన్నారు.
క్యూ లైన్లలో చేరిన భక్తులకు దర్శనం కోసం అధిక సమయం పట్టే నేపథ్యంలో వారికి పాలు అందించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించారు. క్యూలైన్లలో వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఎంటర్ కాకముందే అవసరమైన మేర టాయిలెట్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టాయిలెట్స్ దగ్గర ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని కేటాయించి ప్రతి 15 నిమిషాలకు శుభ్రం చేసే విధంగా చూడాలని అన్నారు. శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగడానికి వీలు లేదని, ఈ బాధ్యతను సమిష్టిగా తీసుకోవాలని అన్నారు. శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వచ్చే వి.ఐ.పి. లను ప్రత్యేక లైన్ లో తీసుకొని వెళ్ళాలని అన్నారు. ధర్మ గుండం వద్ద గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని, అక్కడ నీరు రెగ్యులర్ గా చేంజ్ చేస్తు ఉండాలని తెలిపారు. భక్తులకు వీలైనంత తక్కువ సమయంలో రాజన్న దర్శనం జరిగేలా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వ విప్ అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో ఫోన్ సిగ్నల్స్ సమస్య దృష్టిలో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో మొదలగు ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవర్ల ఏర్పాటు చేయాలని అన్నారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు వేములవాడ కు గతం కంటే 30% అధికంగా బస్సు సర్వీసులు నడపాలని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రూట్లలో అదనపు సర్వీసులు నడపాలని ప్రభుత్వ విప్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ అందించిన సూచనలు పాటిస్తూ అధికారులు వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వేములవాడలో ఆలయానికి సమీపంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలు, పొలాలను రైతుల సంపూర్ణ సహకారంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, వేములవాడ పట్టణానికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయాలని, రోడ్డుకు ఇరు వైపులా పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
జాతర విధులు నిర్వహించడానికి వచ్చే సిబ్బందికి, మహాశివరాత్రి జాతర సందర్భంగా వచ్చే ముఖ్య అతిథులకు, వి.వి.ఐ.పి, వి.ఐ.పి లకు వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. భక్తుల కోసం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పందిరి దగ్గర అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ చల్లి వేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరాలలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు కళ్యాణ కట్టలు ఏర్పాటు చేయాలని, బద్ది పోచమ్మ ఆలయం, నాంపల్లి ఆలయం వద్ద అదనపు క్యూ లైన్లు సిద్ధం చేయాలని, అవసరమైన భద్రత కల్పించాలని, విద్యుత్ అలంకరణ పనులు ఆకర్షణీయంగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్, జగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర అవసరమైన హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహా జాతర జరిగే సందర్భంగా మద్యం అమ్మకాలను వేములవాడ పరిసరాలలో నిషేధించాలని అన్నారు. మహాశివరాత్రి జాగారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మహా భారతం, శివ పురాణం మొదలగు భక్తి పర్యంతమైన కార్యక్రమాలు జరిగేలా చూడాలని, జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రసాదం కౌంటర్లు మరిన్ని చోట్ల పెట్టాలని అన్నారు. గతం కంటే అధికంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, అక్కడ పోలీసుల కోసం టెంట్, త్రాగు నీటి సరఫరా ఉండాలని అన్నారు. బద్ది పోచమ్మ ఆలయం వద్ద రోడ్డు ఆక్రమణలు కాకుండా డ్రైవ్ పెట్టాలని అన్నారు. తిప్పాపూర్ చౌరస్తా దగ్గర సాయంత్రం ఉండే మార్కెట్ జాతర సమయంలో ఉండకుండా ముందస్తు సమాచారం సంబంధిత వ్యాపారులకు అందజేయాలని ఎస్పి మున్సిపల్ అధికారులకు సూచించారు.
వేములవాడ ఆలయం ప్రధాన అర్చకులు భీమ శంకర శర్మ మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఫిబ్రవరి 25, 2025 న రాత్రి ప్రభుత్వం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు పట్టు వస్త్రాల సమర్పణ, తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని, ఫిబ్రవరి 26 తెల్ల వారుజామున 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పుర జనులకు సర్వదర్శనం, తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 3.30 గంటల వరకు ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళ వాయిద్యంలో ప్రదర్శన, ఉదయం 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతః కాల పూజ/అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందని తెలిపారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహా లింగార్చన (స్వామివారి కల్యాణ మండపంలో) అనువంశిక బ్రాహ్మణోత్తముల దర్శనం , రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భావ కాలం నందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈ.ఓ వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.