MLA Rama Rao Patel: కుల వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఖాది ఇండియా పథకం కింద 33 మంది కుమ్మరి కులస్తులకు ఎలక్ట్రికల్ పాటర్ వీల్ మట్టి పరికరాలు తయారు చేసే యంత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కుల వృత్తుల వారు నడుచుకోవాలన్నారు. కుమ్మరి కులస్తుల సంక్షేమానికి తన వంతుగా పాటుపడతానని తెలియజేసారు. మట్టి పాత్రలను కాల్చే యంత్రాలతో పాటు, విశ్వకర్మ పథకం కింద రుణాలను ఇప్పిస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ పాటర్ వీల్తో వాటర్ బాటిల్, పూలకుండి, ఇతర ఆధునిక కాలానికి అనుగుణంగా పాత్రలు తయారుచేసి ఎమ్మెల్యే సమక్షంలో చూపించారు. అనంతరం ఖాదీ ఇండియా ద్వారా ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కుమ్మరి జాగృతి సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు లింగన్న, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ జడ్పీటీసీలు నాయకులు సొలంకి భీమ్ రావ్, సావ్లీ రమేశ్, బీజేపీ సభ్యత్వ నమోదు జిల్లా కో-ఆర్డినేటర్ సిరం సుష్మ రెడ్డి, నాయకులు చంద్రకాంత్ పటేల్, కుమ్మరి జాగృతి సొసైటీ నాయకులు పాల్గొన్నారు.