Palabhishekham: సారంగాపూర్, మార్చి 8 (మన బలగం): సారంగాపూర్ మండలం నగునూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, దళిత సంఘాలు నేతలతో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించడం చాలా బాధాకరమన్నారు. ఈ సంఘటన వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.