KCR BRS PARTY PRECIDENT
KCR BRS PARTY PRECIDENT

KCR, BRS: కదనరంగంలోకి అధినేత

  • అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉద్యమ పార్టీకి గడ్డుకాలం
  • ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు
  • పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పక్కచూపులు చూసిన అభ్యర్థులు
  • సత్తాచాటాలని నేరుగా రంగంలోకి కేసీఆర్
  • పూర్వ వైభవం సాధ్యమేనా?

KCR, BRS: తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీ రానురాను ప్రాభవం కోల్పోతున్నది. వరుసగా రెండుసార్లు అధికారం చేజిక్కించుకొని తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీకి గడ్డుకాలం వచ్చిపడింది. ఒకప్పుడు పార్టీలో చేరేందుకు క్యూ కట్టిన నేతలు.. అధికారం కోల్పోగానే అంతా అయిపోయిందన్నట్లు అధికార, ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, మాజీలతో సహా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం అధికార, విపక్ష పార్టీల్లో చేరిపోయారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీకి మునుపటి ప్రభ తీసుకొచ్చేందుకు స్వయంగా అధినేతే కదనరంగంలోకి దిగుతున్నారు. బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రతి మండలాన్ని టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి తమకు ప్రజాబలం తగ్గలేదన్న సంకేతాలు పంపేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి పార్టీకి పూర్వ వైభవం వస్తుందో లేదో భవిష్యత్తుపై ఆధారపడి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా..
వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మూడోసారి అధికారాన్ని దూరం చేశాయని చెప్పొచ్చు. సీఎంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు కొందరికే (కొన్ని సామాజిక వర్గాలకు) మేలు చేస్తున్నాయని ప్రజలు నమ్మారు. దీనికితోడు ఉద్యమ పార్టీపై క్రమంగా వ్యతిరేకత రావడం, కిందిస్థాయి లీడర్ల అతి పార్టీకి చేటు చేసిందనే చెప్పాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేవలం 38 అసెంబ్లీ స్థానాలు సాధించి అధికారం కోల్పోగా, అనూహ్యంగా మెజార్టీ స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఇన్నాళ్లు పార్టీలో పదవులు అనుభవించిన వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో సహా కిందిస్థాయి లీడర్లు సైతం బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. దీనికితోడు కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం తమ స్వలాభం కోసం అధికార పార్టీలోకి జంప్ అయ్యారన్న విమర్శలున్నాయి.

ఇక్కడ వద్దని.. అక్కడి నుంచి పోటీ
బీఆర్ఎస్ ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో పార్టీని నమ్ముకొని ఉన్న కొందరికి కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చేందుకు ఒకే చెప్పారు. కొందరికి టికెట్లు సైతం కన్ఫామ్ చేశారు. తాము బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని గ్రహించిన పలువురు సిట్టింగులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆ సీట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నది.

ఆ ఆరు స్థానాలపై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో చేరారు. అదే స్థానాల నుంచి మరోసారి ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ స్థానాలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయనకు మరోసారి కేసీఆర్ టికెట్ ఇస్తానన్న తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పి టికెట్ నిరాకరించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సెగ్మెంట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపుకోసం తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.

చెక్ పెట్టేలా వ్యూహం

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పట్టు ఉండడంతో ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ సైతం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు చక్రం తిప్పుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కూడా బీజేపీలో చేరారు. ఈసారి ఆయన పోటీ చేయకుండా తన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపారు. ఈ క్రమంలో ఆయనకు చెక్‌ పెట్టేలా అదే సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ బరిలోకి దించింది.

ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను గులాబీ పార్టీ బరిలోకి ఉంచింది. ఆదిలాబాద్‌లో గోడెం నగేశ్‌ను ఎదుర్కొనేలా సీనియర్ నేత అత్రం సక్కుకు టికెట్ ఇచ్చింది. వరంగల్‌లో కడియం కావ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత పార్టీ మారడంతో ఈ అంశాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఓరుగల్లు నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేశ్ కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేత కావడంతో ఇద్దరికీ చెక్ పెట్టేలా బలమైన నేతను బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. జిల్లాకు చెందిన నేతలతో పార్టీ అభిప్రాయ సేకరణ చేసి చివరికి డాక్టర్ మారెపెల్లి సుధీర్ కుమార్‌ను బరిలోకి దించింది.

చేవెళ్ల సభతో మొదలు
మాజీ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా చేవెళ్ల నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. శనివారం భారీ జన సమీకరణ మధ్య తన ప్రచార అస్ర్తాలను బయటకు తీయనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ సభలు నిర్వహించి జనం మద్దతు కూడగట్టేలా ముందుకు సాగుతున్నారు. దీనికితోడు పార్టీ మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టడంతో పాటు గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటేనే పార్టీ క్యాడర్‌లో జోష్‌ పెరుగుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి.. పార్లమెంటు ఎన్నికల్లోనైనా గులాబీ పార్టీకి కలిసి వస్తుందో లేదో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *