- మట్టితో చెరువు నింపుతున్న వైనం
- కళ్లున్నా చూడలేని అధికారులు
Chintakunta Lake: జగిత్యాల ప్రతినిధి, మార్చి 26 (మన బలగం): వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన చింత కుంట చెరువు క్రమేణా కబ్జా కోరల్లో చిక్కి చిన్నదైపోగా మరో దఫాగా చెరువులో మట్టిని నింపుతూ కబ్జాకు రంగం సిద్ధం చేస్తున్న సంఘటన ఇది. జగిత్యాల నిజామాబాదు రోడ్డులో ఉన్న చింతకుంట చెరువుకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చేరువును గత ప్రభుత్వం అభివృద్ధి చెరువు కట్ట ఎత్తు పెంచి సుందరికరించి అభివృద్ధి చేసింది. ఇలా ఓ వైపు అభివృద్ధి ఛాయలు కనిపిస్తుండగా పక్కనే ఇదే చెరువులో మట్టి నింపుతూ కబ్జాకు కుట్ర చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఎకరాల చెరువు అన్యాక్రాంతం అయిందని ఉన్న చెరువును కాపాడేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించాలని స్థానికులు అంటున్నారు. హైదరాబాద్లో కబ్జాకు గురైన చెరువుల విస్తీర్ణం పెంచేందుకు హైడ్రా రంగంలోకి దిగిందని స్థానికులు అంటున్నారు. చెరువు కట్టకు కింది వైపునే రోడ్డును ఆనుకొని ఈ కబ్జా కోణం మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కూడా ఈ చెరువును పూడుస్తున్న సంఘటనపై స్పందించక పోవడం వెనుక రానున్న మున్సిపల్ ఎన్నికలేమోనని స్థానికులు అంటున్నారు. ఎన్నో విధాలుగా ప్రజల మేలు కోరే చెరువుల ఆక్రమణలను నిరోధించాల్సిన అవసరం జిల్లా అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు.
