- భవన నిర్మాణ శాఖలో అవినీతి రాజ్యం
- టీపీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి
Councilors protest: నిర్మల్, జనవరి 4 (మన బలగం): అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన భవన నిర్మాణ శాఖ సిబ్బంది అక్రమార్కులకు అండగా నిలుస్తూ నిరుపేదలను నిలువునా దోచుకుంటున్నారని కౌన్సిలర్ మేడారం అపర్ణ, మాజీ కౌన్సిలర్ ప్రదీప్ ఆరోపించారు. శనివారం టౌన్ ప్లానింగ్ అధికారి తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితులతో పాటుగా బైఠాయించారు. బాధితులు ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ పోసుకొని హెచ్చరించారు. గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన శక్కరి గోపి ఇంటి నిర్మాణం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాన్ని నిలిపివేసి సీజ్ చేస్తామని హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఆందోళన విరమించాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణ ఎస్సై హనుమాండ్లు సూచించినప్పటికీ బాధితులు, కౌన్సిలర్లు వినకుండా సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ఎండీ కమర్ అహ్మద్ కౌన్సిలర్లు, బాధితులతో మాట్లాడి విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.