woman died: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 28 (మన బలగం): జ్వరం రావడంతో ఓ మహిళ ఆర్ఎంపీ వద్దకు వెళ్లింది. ఆర్ఎంపీ వైద్యంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంఘటన గంభీరావుపేట మండలంలోని తుర్కకాశి పల్లెలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కకాశి పల్లెకు చెందిన ఖాసింబీ (28)కి రెండు రోజుల క్రితం జ్వరం రాగా సమీపం గ్రామం తిమ్మాపూర్లోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లింది. అతను ఆమెను పరీక్షించి సెలైన్లో ఇంజక్షన్ వేసి చికిత్స ప్రారంభించాడు. కొద్ది సేపటికే ఖాసీంబీకి చలి తీవ్రమైంది. మరో సెలైన్లో ఇంజక్షన్ వేసి ఎక్కించి ఓ రెండు మాత్రలు వేసుకోమ్మన్నాడు. కానీ పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో తన వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అక్కడ పరీక్షించిన వైదులు పరిస్థితి విషమంగా ఉందని పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. కానీ తమ వద్ద అంత డబ్బు లేదని, ఇక్కడే వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. చికిత్స పొందుతూ ఖాసీంబీ శుక్రవారం రాత్రి మృతిచెందింది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త అజీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైద్యం చేసిన ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు.