Chief Minister Revanth Reddy: తెలంగాణ బ్యూరో/మనబలగం: అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.కోటి నజరానా ప్రకటించారు. మహిళల అండర్-19 ప్రపంచ కప్లో టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించిన ముఖ్యమంత్రి అలాగే, అండర్ -19 ప్రపంచ కప్ టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, ఇతర ప్రముఖులు ఉన్నారు.
