Prime Minister Modi: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుంభమేళాలో పవిత్రస్నానమాచించారు. ఉదయమే ఇక్కడికి చేరుకున్న మోడీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. అనంతరం గంగామాతకు హారతి ఇచ్చారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత మోడీ మాట్లాడుతూ ‘ఆరాధించే గొప్ప భాగ్యం నాకు లభించింది. గంగామాత దీవెనలు పొందిన తరువాత మనస్సుకు అపారమైన శాంతి, సంతృప్తి లభించాయి. దేశప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం మరియు సంక్షేమం కోరుకుంటున్నాను.’ అని తెలిపారు. ముందుగా ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మోడీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు చేరుకున్నారు. బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. మోడీ రాక సందర్భంగా ప్రయాగ్రాజ్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీన ముగుస్తుంది. ప్రతి రోజూ కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఘాట్లన్నీ యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చారు. సామాన్యులతోపాటు ప్రముఖులు హాజరవుతున్నారు.

