Collector Abhilash Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 5 (మన బలగం): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 10వ తేదీన నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే అల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత సమస్య తగ్గుతుందన్నారు. విద్యాశాఖ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలను అందివ్వాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి, వయసులవారీగా మాత్రల డోస్ ఇవ్వాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మాత్రలు ఇంటికి ఇవ్వరాదన్నారు. భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలన్నారు. మాత్రలు వేసే ప్రదేశంలో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రత్యేక షెడ్యూల్ను ఏర్పరుచుకొని నులిపురుగుల నిర్మూలన మాత్రలను అందరికీ అందివ్వాలన్నారు. ప్రజలకు ఆల్బెండజోల్ మాత్రల ఉపయోగలపై విస్తృత అవగాహన కల్పించి, పిల్లలందరూ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
10 వ తేదీన మాత్రలు తీసుకొనివారికి 17వ తేదీన మాప్ అప్ డే నిర్వహించి మాత్రలను అందించాలన్నారు. జిల్లాలో దాదాపు 1 లక్షా 96 వేల మంది 1 నుంచి 19 సంవత్సరాల వయసు గలవారు ఉన్నారని తెలిపారు. అనంతరం జిల్లాలో గల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్య చికిత్సల వివరాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్, ఖానాపూర్, భైంసా, నర్సాపూర్.జి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఇప్పటివరకు జరిగిన సీజేరియన్, సాధారణ ప్రసవాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో కల్పించాలని తెలిపారు. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో అవసరమగు వైద్య పరికరాల, సిబ్బంది వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశాలలో డిఎంహెచ్ఓ రాజేందర్, డిఇఓ పి. రామారావు, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్ గౌడ్, మెప్మా పిడి సుభాష్, ఏసిడిపిఓ నాగలక్ష్మి, వైద్యాధికారులు, వైద్యులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.