Indiramma houses: నిర్మల్, జనవరి 23 (మన బలగం): ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లకు, నియోజవర్గ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంకగారి భూమయ్య డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లల్లో అవకాశాలు ఇవ్వాలని, నియోజవర్గ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇండ్ల స్థలాలు ఇళ్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యేల మాట నిలబెట్టుకోవాలని అన్నారు. నిర్మల్ ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు నిర్మాణం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. నిరంతరం అనేక వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మండలాలలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారని తెలిపారు. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన వారై ఉంటారని, అందరికీ ఒకే దగ్గరగా మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. గ్రామానికి వచ్చే ఇందిరమ్మ ఇళ్లల్లో ఒకటి రెండు గృహాలను జర్నలిస్టులకు అందజేయడం ప్రజా ప్రతినిధులకు అధికారులకు పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలని వారి సొంత గ్రామాలలో జర్నలిస్టు దరఖాస్తు చేసుకుంటే వాటిని ప్రత్యేకంగా భావించి కచ్చితంగా మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై స్థానిక ఇన్చార్జి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్తో చర్చించి ఇళ్లస్థలాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, జర్నలిస్టు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చ విధంగా కృషి చేయాలని కోరారు.