Road accident: ముధోల్, 13 నవంబర్ (మన బలగం): ముధోల్ మండల కేంద్రంలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది అనడానికి ఇదొక నిదర్శనం. మండలంలో మొరం రవాణాకు ఎవరి అనుమతులు లేకున్నా దర్జాగా అక్రమ రవాణా కొనసాగుతోంది. గ్రామంలో రాత్రి, పగలు తేడా లేకుండా మొరాన్ని ముధోల్ మండలం నుంచి ఇతర మండలానికి తరలిస్తున్నారని పలు మార్లు స్థానిక అధికారులను గ్రామస్తులు విన్నవించినా ఫలితం లేదు. పూర్తి స్థాయిలో మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లేదనే చెప్పాలి. స్థానికంగా మైనింగ్ అధికారులు ఉండకపోవడంతో వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొందరు అధికారులు సైతం మామూళ్లకు బానిసై అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం తరోడా గ్రామానికి చెందిన అల్తాఫ్(38) అతివేగంతో టిప్పర్ నడుపుతూ అదుపు తప్పి గురుకుల గిరిజన సంక్షేమ కళాశాల ముందు రోడ్డుకు పక్కన ఉన్న ఇనుప రైలింగ్ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ క్రమంలో అల్తాఫ్పై టిప్పర్ ముందు భాగంలోని టైర్ కింద పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ జి.మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో మృతదేహం తీసి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ను ముధోల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
