Whip Adluri Laxman Kumar: జగిత్యాల ప్రతినిధి, జనవరి 8 (మన బలగం): జగిత్యాల జిల్లాలోని రైతాంగం సాగు నీటి కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇరిగేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులు సాగు నీటి కొరతతో ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రతి రైతుకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను వేగవంతం చేసి రైతుల అవసరాలు తీర్చాలని అన్నారు. అధికారులు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయాలని, వారబంధి ద్వారా జోన్ 1, జోన్ 2లకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా విడుదల చేయాల్సిన నీటిని విడుదల చేయాలని సూచించారు. మన ప్రాంతం జోన్ 1 కిందకు రావడం జరుగుతుందని, కొన్ని చోట్ల మోటార్లు పెట్టడం, ఇతరత్రా కారణాలతో నీరు అందాల్సినంత అందడం లేదని తెలిపారు. వారబంధీ రోజులను పెంచాలని సూచించామన్నారు. జంగనాల ప్రాజెక్ట్పై అధికారులతో చర్చించామన్నారు.
గత ప్రభుత్వ పాలకులు వెల్గటూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి దికొండ వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసారని, అదే రంగధాముని పల్లె వద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు రైతులకు ఎక్కడ నుంచి నీరు అందించాలి, ఎక్కడి నుంచి అందిస్తే మేలు జరుగుతుందో అనే విషయాన్ని ఆలోచించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జోన్ 2 ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. గోదావరి నది లిఫ్టులపై ఆధారపడి సాగు చేసుకునే రైతాంగాన్ని ఆదుకునే విధంగా గోదావరిలో ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. దానిపై వారు సానుకూలంగా స్పందించారని, ఇట్టి సమావేశంలో రైతులను పాల్గొని వారి సూచనలు తీసుకోనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రైతుల సూచనలు కనీసం పట్టించుకోలేదని, కానీ మన ప్రభుత్వంలో వారి సూచనలు పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తామని, రైతులు ఎవ్వరూ అందోళన పడాల్సిన అవసరం లేదని, ఏ ఒక్క రైతుకు నష్టం వాటిల్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.