Friends service: ఎల్లారెడ్డిపేట, జనవరి 29 (మన బలగం): వారంతా ఒక్క పాఠశాలలో చదువుకున్నారు. పదో తరగతి కాగానే ఎవరి దారి వారిది అయ్యింది. ఎక్కడి వారు అక్కడే స్థిరపడ్డారు. కానీ అందరి మదిలో వచ్చిన ఒక ప్రేరణే అదే పేరుతో ఒక ప్రేరణ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసేలా దోహదపడింది. అనుకున్నదే తడవుగా 24 ఏండ్ల క్రితం విడిపోయిన స్నేహితులు కరోనా మహమ్మారి పుణ్యమా అని ఒక సంస్థను నెలకొల్పారు. నాలుగేళ్లుగా ఎందరో పేదలకు భోజనం అందించడమే కాకుండా, నిత్యావసర సరుకులు అందజేశారు. తాజాగా అదే సంస్థ ద్వారా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిలువ నీడలేకుండా ఆరుబయట జీవితాలను గడుపుతున్న సుమారు 50 కుటుంబాలకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు. సేవా కార్యక్రమంలో విజ్ఞాన వర్ధిని హైస్కూల్ ఎస్సెస్సీ 2000 బ్యాచ్ విద్యార్థులు మోర శ్రీహరి పోకల కిరణ్, తడుక భాను శ్రీగాధ వేణు, దుర్గాప్రసాద్, ప్రేరణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్నారపు వేణుగోపాల్, నీలి సంతోష్, బూర సతీశ్, శ్రవణ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.