Whip Adluri Laxman Kumar:పెగడపెల్లి, ఏప్రిల్ 3 (మన బలగం): పెగడపెల్లి మండలం నంచర్ల నుంచి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు గురువారం నిర్వహించిన ‘జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్’ పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అణచివేత ధోరణి, కుటిల బుద్ధి బయటపడిందన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే మోడీ ప్రధానమంత్రి కుర్చీలో, అమిత్ షా హోం శాఖ కుర్చీలో కూర్చున్నారన్న విషయం మర్చిపోవద్దని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా, విప్ హోదాలో కొనసాగుతున్నానంటే దానికి అంబేద్కర్ పెట్టిన భిక్ష అని తెలిపారు. అమిత్ షాపై చర్యలు తీసుకొని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
