Development works in tribal and forest areas Nirmal district: జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల ద్వారా మంజూరైన పనులపై సమగ్ర సమీక్ష జరిపారు. ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతిని, అటవీ, రెవెన్యూ శాఖల అనుమతుల మంజూరు స్థితిని వివరంగా అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు సమన్వయం అవసరమని సూచించారు.
ముఖ్యంగా ఖానాపూర్, దస్తురాబాద్, కడెం, సారంగాపూర్ మండలాలలోని ఆయా ప్రాంతాలలో రెవెన్యూ, అటవీ శాఖలు కలిసి జాయింట్ సర్వే చేపట్టి, అటవీ హద్దులు, భూవివాదాలు లేకుండా పనులను పూర్తి చేయాలని సూచించారు. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సర్వే, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించారు. అటవీ, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనపై అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఎఫ్వో నాగినిబాను, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
