General strike
General strike

General strike: 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

General strike: దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నేల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్ నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ చాయ్ వాలా పేరుతో దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ, హక్కులను హరిస్తున్నారని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తెచ్చారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద బడుగు బలహీన వర్గాలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేసి కోట్లాది మంది కూలీలకు పని కల్పించిందన్నారు.

నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నారని, పని రోజులు తగ్గిస్తున్నారని, పని ప్రదేశాల్లో పనికి ముందు పనికి తర్వాత కూలీలను ఫొటో అప్లోడ్ చేసే విధానాన్ని తెచ్చారని అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, రోజు వారి కూలీ 600 చెల్లించాలని, వేసవి భృతి యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో కొలుతలు లేకుండా పని కల్పించి బిల్లులు చెల్లించాలని, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం ఆపాలనే, ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలను మానుకోవాలని కోరారు. 20వ తేదీన కూలీలు ఉపాధి హామీ పనులను బంద్ చేసి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. సమావేశంలో బి కె యం యు జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, ఏ ఐ ఏడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సుంకరి సంపత్ నాయకులు నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *