Miss World 2025
Miss World 2025

Miss World 2025: సొగసు చూడతరమా..!

  • అటు చార్మినార్ అందాలు.. ఇటు ప్రపంచ సుందరీమణుల తళుకులు
  • చార్మినార్‌ వద్ద ప్రపంచ సుందరి పోటీదారుల సందడి
  • గ్రూప్ ఫొటోలకు ఫోజులిచ్చిన భామలు
  • లాడ్ బజార్‌లో షాపింగ్.. ముత్యాలహారాలు, గాజులు కొనుగోలు

Miss World 2025: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad)కు మకుటాయ మానంగా నిలుస్తుంది చార్మినార్(Charminar). ఎంతో ప్రాశస్త్యం ఉన్న చార్మినార్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. చార్మినార్ అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన కట్టడం మరో కిర్తీ కిరీటాన్ని అధిరోహించింది. మరో మైలురాయిని తాకి హైదరాబాద్ పేరును ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసింది. మిస్ వరల్డ్-2025 పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు (Contestants) ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారు రెండు మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని చార్మినార్‌ను సందర్శించి సందడి చేశారు. 109 దేశాల సుందరీమణులు చార్మినార్ వద్దకు చేరుకోగా వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికారు. వారి రాకను సూచిస్తూ అరబ్బీ మర్ఫా సంగీతాన్ని ప్రదర్శించారు.

చార్మినార్ అందాలను తిలకించి మంత్రముగ్దులయ్యారు. తమ సెల్ ఫోన్లలో ఫొటోలు తీసి సంబరపడ్డారు. చార్మినార్ ముందు భామలు సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఒక వైపు చార్మినార్ సొగసులు.. మరో వైపు అందాల భామల తళుకులతో ఆ ప్రాంతం శోభాయమానంగా మారింది. లాడ్ బజార్‌లోని తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేశారు. అక్కడే గాజుల తయారీ విధాన్ని తిలకించారు. నాలుగు గ్రుపులుగా విడిపోయి ఒక్కో గ్రూపు రెండు షాపులలో షాపింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటే్ వాక్ (Heritage Walk) చేశారు. హెరిటేజ్ వాక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాతబస్తీ విధులన్నీ పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, శాలిబండ, వోల్గాజంక్షన్, ఖిల్వత్ రోడ్లను బ్లాక్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *