Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 6 (మన బలగం): జిల్లాలో పెండింగ్ రహదారుల మరియు భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రోడ్లు మరియు భవనాల పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్లు బోనాల శాఖ పరిధిలో 12 రోడ్లు, 8 భవనాలు (వైద్య కళాశాలతో సహా), 7 బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు భవనాల శాఖ పరిధిలో పెండింగ్ రహదారి పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ఏదైనా తాత్సారం ఉంటే వివరాలు అందించాలని, ప్రభుత్వానికి లేఖ రాసి బిల్లుల చెల్లింపు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రతి రోడ్డు నిర్మాణ స్థితిగతుల గురించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల పలు సూచనలు చేశారు. ప్రస్తుత త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చే రోడ్డు నిర్మాణ పనులు ప్రాధాన్యతతో చేపట్టాలని అన్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు ఇసుక సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. వీర్నపల్లి దగ్గర పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయింపులు చేయాలని కలెక్టర్ సంబంధిత తహసిల్దార్కు చరవాణిలో ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిందని, అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి పనులు వెంటనే జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి పనులు క్షేత్రస్థాయిలో త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని అన్నారు. డి.ఎం.ఎఫ్.టి పరిధిలో పెండింగ్ ఉన్న బిల్లుల వివరాలను సమర్పించాలని, వెంటనే చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 166 కోట్లతో చేపట్టిన వైద్య కళాశాల పనులు పురోగతిలో ఉన్నాయని వీటిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, అన్నదాన సత్రం, ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్తాబాద్ మండలంలో తహసిల్దార్ కార్యాలయం నిర్మాణం, కోర్టు భవనాల నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈలు శాంతయ్య, కిరణ్ కుమార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.