- సమస్యలపై పోరాడుదాం
- టీడబ్ల్యూజేఎఫ్ బలోపేతం చేయాలి
Telangana Working Journalists Federation Nirmal Meeting 2025: నిర్మల్, ఆగస్టు 24 (మన బలగం): సమాజంలో పడిపోతున్న జర్నలిజం విలువలను కాపాడుకుంటూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. సంఘంలోని బాధ్యులంతా సమిష్టిగా ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు అండగా ఉండాలని, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ నిర్మల్ జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ,జర్నలిస్టుల పట్ల పాలకులు వివక్ష చూపుతున్నా రని, ఈ వైఖరిని ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించక పోగా జర్నలిస్టులను దూషించడం, అవమానించడంలో కేసీఆర్ ను మించిపోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాని, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేని పక్షంలో రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పించుకోవడం సరైంది కాదని అన్నారు. ప్రత్యామ్నాయ జీవో ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని మామిడి సోమయ్య కోరారు.రాష్ట్రంలో చాలా ఏళ్ళుగా నడుస్తున్న అనేక చిన్న పత్రికలను ప్రభుత్వం గుర్తించకుండా అణచివేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని, రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలకు సిద్దమవ్వవ్వాలని కోరారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మిట్టపల్లి మధు, గడ్డం సత్యగౌడ్, ఉపాధ్యక్షుడు కామెర వెంకటస్వామి, సంయుక్త కార్యదర్శి ఇప్ప సురేష్, కోశాధికారి సబ్బని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ నిర్మల్ జిల్లా కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నిర్మల్ జిల్లా తృతీయ మహాసభలో జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా జగన్నాథం శ్రీనివాస్ చారి (ప్రజాదర్బార్), ఉపాధ్యక్షులుగా జాదవ్ పవన్(ఐ న్యూస్), పాతర్ల రాజు ముదిరాజ్(నేటి వార్త), కరిపే మల్లేష్ (సీనియర్ జర్నలిస్టు), కార్యదర్శి శేషగిరి రాజు(సూర్య), సంయుక్త కార్యదర్శులు ఎన్.మల్లేష్(ప్రజాదర్బార్), రాజేశ్వర్ గౌడ్(సూర్య), కోశాధికారిగా ఎ.శంకర్, కార్యవర్గ సభ్యులుగా బత్తుల నారాయణ, సాయినాథ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మురళీ గౌడ్, దుర్గాప్రసాద్, ఎ.శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, తన్నీరు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.
