Whip Aadi Srinivas: ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని శివార్చన మండపం వద్ద సత్రం నిర్మాణానికి స్థలాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తాను ఇటీవల స్వామి వారి దర్శనం చేసుకున్న సందర్భంగా చేసిన ప్రకటనలో భాగంగా ఈ రోజు స్థల పరిశీలన చేశామని తెలిపారు. రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం, వసతి ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బ్రేక్ దర్శనం అమలు చేస్తునామని తెలిపారు. అలాగే భక్తులకు ఆకలి తీర్చేందుకు నిత్యం అన్నం అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రోజూ 15,000 మంది భోజనం చేసే విధంగా భవనాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించాలని, శనివారం లోగా ప్రతిపాదనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్, డి ఈ రఘునందన్ ప్రొటోకాల్ పర్యవేక్షకులు అశోక్, శివ సాయి పాల్గొన్నారు.