- బైపాస్ నుంచి డంపు యార్డును వెంటనే తరలించాలి
- సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
Dumping yard: కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ను వెంటనే అక్కడి నుంచి తరలించాలని కోరుతూ సోమవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరానికి ఆనుకుని ఉన్న బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల దాదాపు పది డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డ్ పొగ వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్ను తరలిస్తామని చెప్పి కొన్ని రోజుల క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని సాక్షాత్తు తీసుకెళ్లి త్వరలోనే తరలిస్తామని చెప్పి చిలక పలుకులు పలికిన ఎంపీ బండి సంజయ్ నేటికీ డంపింగ్ యార్డ్ తరలింపుకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం పలుమార్లు డంపింగ్ యార్డ్ను సందర్శించి పొగలు రాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మాటలు చెప్పాడు తప్ప చేతుల్లో ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే మాటలు నీటి మూటలేనని, నగర ప్రజల ఇబ్బందులు వీరికి పట్టకపోవడం దుర్మార్గ చర్య అని సురేందర్ రెడ్డి విమర్శించారు. సీపీఐ నగర సహాయకార్యదర్సులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ దగ్గరలో తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మించారని, దీంట్లోనూ గత మేయర్ సునీల్ రావు పూర్తిగా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతిపైనా విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నగరపాలక సంస్థ కమిషనర్ మొద్దునిద్రలో ఉన్నారని మండిపడ్డారు. వెంటనే కమిషనర్ డంపింగ్ యార్డ్ సందర్శించి పొగలను ఆర్పి వేసేందుకు తగు చర్యలు తీసుకొని, డంపింగ్ యార్డ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ పొగ కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు రోజు నిరసనలు తెలియజేస్తున్న మున్సిపల్ అధికారులకు ఏమాత్రం పట్టింపు లేకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చెత్తతో ధర్నా చేస్తామని పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కిన్నెర మల్లమ్మ, బావండ్లపెల్లి యుగంధర్, నగర కార్యవర్గ సభ్యులు సాంబరాజు, కూన రవి, రమేశ్, చంచల మురళి, మాడిశెట్టి అరవింద్, అంజన్న, వెంకటేశ్, సురేశ్, కిరణ్, సత్యనారాయణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.