Dump yard
Dump yard

Dump yard: బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్‌ను తరలించాలి: సీపీఐ

Dump yard: కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్‌లోని డంపు యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగను వెంటనే ఆర్పివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో వందలాదిగా ప్రజలు తరలిరావాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు ఒక సంయుక్త ప్రకటనలో నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్న బైపాస్ రోడ్‌లో గల డంప్ యార్డు వల్ల నగరంలోని దాదాపు పది డివిజన్లలో ముఖ్యంగా కోతిరాంపూర్, అలకాపురి, హనుమాన్ నగర్, గణేశ్ నగర్, లక్ష్మీ నగర్, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూర్, పోచమ్మవాడ, శాషామహల్, మారుతి నగర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఎండాకాలంలో మంటలు అంటుకుని పొగ రావడం వల్ల వాయు కాలుష్యం నెలకొని చాలామంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో హాస్పిటల్ పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణులు ఈ పొగ పీల్చడం ద్వారా పుట్టే బిడ్డలకు ఇబ్బందులు జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. కనీసం నగరపాలక అధికారులకు డంపు యార్డు తరలింపుపై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కరీంనగర్ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు కొన్ని కోట్ల రూపాయలతో చెత్తను శుద్ధి చేయడం కోసం మిషనరీని ఏర్పాటు చేశారని ఆ మిషనరీ రెండు, మూడు రోజులు మాత్రమే నడిచి మూలకు పడ్డదని కోట్ల రూపాయల మిషనరీలో కుంభకోణానికి మేయర్, ఎమ్మెల్యే పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపు యార్డ్ మిసనరి కొనుగోలుపై న్యాయవిచారణ చేయాలన్నారు.

దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మేయర్ తన హయంలో స్మార్ట్ సిటీలో డంప్ యార్డ్ మిషనరీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తన హయాంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరీంనగర్‌లోని తీగల వంతెన, రివర్ ఫ్రంట్‌లలో తీవ్ర అవినీతి జరిగిందని సాక్షాత్తు మాజీ మేయర్ సునీల్ రావు చెప్పడం చూస్తుంటే ప్రజలు వీస్తూ పోతున్నారని అన్నారు. తీగల వంతెనపై నెలల తరబడి వీధి దీపాలు రాకపోవడం చూస్తుంటే నగరపాలక కమిషనర్ మొద్దు నిద్రలో ఉన్నారా అని వారు ప్రశ్నించారు. డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ప్రతి రోజు నిరసనలు తెలుపుతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి డంప్ యార్డులో వస్తున్న మంటలను ఆర్పి వేయుటకు చర్యలు తీసుకోవాలని, వెంటనే డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *