Former Minister Koppula Ishwar
Former Minister Koppula Ishwar

Former Minister Koppula Ishwar: పంట పొలాలకు నీళ్లు అందించి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Former Minister Koppula Ishwar: ధర్మపురి, జనవరి 10 (మన బలగం): ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులు వరి నాట్లు చివర దశకు చేరుకున్న తరుణంలో గోదావరిలో నీరు లేక వరి ఎండిపోయే పరిస్థితి ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేసారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతం దమ్మున్నపేటలోని గోదావరిని కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీళ్లు లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గోదావరిలో నీళ్లు లేక ఎడారి లాగా కనిపిస్తుందని, గతంలో నిండు కుండలా ఉన్న గోదావరి ప్రస్తుతం ఒక్క చుక్క నీళ్ళు లేని పరిస్థితి ఉందన్నారు. కమ్మునూరు మంగెల బోర్నపల్లి నుంచి ధర్మపురి వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా 18 నుంచి 20 లిఫ్ట్‌లు నడుస్తున్నాయని తెలిపార. ఒక్కో లిఫ్ట్ కింద 2 వేల నుంచి 3 వేల ఆయకట్టుకు ఉన్నదని వెల్లడించారు. అవి కాకుండా స్వతహాగా పంపు సెట్లు పెట్టుకున్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో 50 వేల ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారని, ఇప్పటికే రైతులు నాట్లు వేసుకున్నారని, నీళ్ళ తడి అందని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తుందా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతుల సాగునీటి కష్టాల గురించి సంబంధిత మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ధర్మపురి రైతుల కష్టాలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు రివ్యూ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, సౌళ్ల భీమన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *