Sanitation workers: ధర్మపురి, జనవరి 27 (మన బలగం): ధర్మపురి మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు సోమవారం కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మాజీ కౌన్సిలర్లు జక్కు పద్మ రవీందర్, సంఘనబట్ల సంతోషి దినేశ్, వేముల నాగలక్ష్మి రాజేశ్, గరిగే అరుణ రమేశ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను శాలువాతో సన్మానించి వారికి బట్టలు, చీరలను పంపిణీ చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని, ధర్మపురి మున్సిపాలిటీలో ఇటీవల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసి వాటికి శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మపురి తలపున గోదావరి ఉన్నా ఇక్కడి ప్రాంత ప్రజలు తాగు నీటి విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్డీఎఫ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తే అందులో రూ.6 కోట్లు కేవలం బోర్ వెల్స్కే కేటాయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి సంబంధించి మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధర్మపురి పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
