AIYF National Conventions: ఈ నెల 15 నుంచి18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి(Tirupati)లో జరగనున్న ఏఐవైఎఫ్ (AIYF) 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ కోరారు. శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా యుగంధర్, మహేందర్ మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని విమర్శించారు. మహాసభల్లో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. జాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుంచి సుమారు 800 మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 80 మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈనెల 15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభలో 1000 మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేశ్, చిన్న సదాశివ్, అవినాష్, రమేశ్, దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.