Uttam
Uttam

Minister Uttam Kumar Reddy: త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోలు
  • రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాగానే అమలు
  • పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏమీ లేదు
  • అపోహలు, తప్పుడు వార్తలు నమ్మొద్దు
  • గ్రామసభల్లో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు
  • కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే
  • రుద్రంగి గ్రామసభలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 23 (మన బలగం): రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయని, వీటిని చాలా మంది తినడం లేదని, నూతన రేషన్ కార్డుల జారీ తరువాత ప్రతి ఒక్కరికి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేవలం 40 వేల కార్డులు మాత్రం అందించారని తెలిపారు. జనవరి 26 నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, గ్రామ సభల్లో దరఖాస్తు ఇచ్చినా అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేసారు. గ్రామసభలో ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేని పక్షంలో దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో సాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి ఇక్కడ 100 శాతం అర్హులకు మొదటి దఫాలోనే ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. ప్రస్తుతం సొంత జాగా ఉండి ఇండ్లులేని వారికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల సహాయం అందజేయ బోతున్నామని తెలిపారు. రైతు భరోసా కింద రైతులకు అందే సహాయం 20 శాతం పెంచి ఎకరానికి రూ.12 వేలు అందజేస్తామని, వ్యవసాయ యోగ్యమైన భూమికి పంట వేసినా వేయకున్నా రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. భూమిలేని కూలీలకు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీల కుటుంబాలకు రూ.12 వేలు ఇస్తున్నామని తెలిపారు. ఈ నాలుగు పథకాలను గ్రామసభలు నిర్వహించి ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి 26 నుంచి అమలు చేస్తామని, అర్హులైన చివరి వ్యక్తి వరకు లబ్ధి జరుగుతుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని, గ్రామ సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని కోరారు. జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్ కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామ ప్రజలు తమ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించాలని చేసిన కృషి ఫలితంగా తాను నేడు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. 43 వేల 100 ఎకరాలకు సాగు నీరు అందించే రుద్రమ్మ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతలో పెట్టామని, ఈ పనులను త్వరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేశారు. రుద్రంగి మండలం మానాలలో పాత చెరువు కొత్త చెరువుకు లిఫ్ట్ అందించే తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండవని, మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందించారు. ప్యాకేజీ 9లో మలక్‌పేట్ రిజర్వాయర్‌లో టీఎంసీ నీళ్లు నింపామని, 25 కోట్లు విడుదల చేస్తే అప్పర్ మానేరుకు నీళ్లు తీసుకుని వెళ్లవచ్చని, ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. వేములవాడ, తిప్పాపూర్, కథలాపూర్ బస్టాండ్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని రవాణా శాఖ మంత్రిని కోరారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రుద్రంగి మండల కేంద్రంలో ప్రాథమికంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 103, రైతు భరోసా కింద 1927, నూతన రేషన్ కార్డుల కోసం 802, ఇందిరమ్మ ఇండ్ల కోసం 1375 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల వివరాలు, దరఖాస్తుల సమర్పించని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హత మేరకు పథకాలు అమలుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం మంత్రులు కలికోట – సూరమ్మ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేసి, ప్రాజెక్ట్ పరిధిలోని భూములకు సాగునీటిని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇతర పనులకు అన్ని నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏడీ మైన్స్ క్రాంతి కుమార్, కో-ఆపరేటివ్ చైర్మన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Uttam
Uttam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *