Cotton purchases: నిర్మల్, అక్టోబర్ 16 (మన బలగం): పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్ల పై సంబంధిత శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 1 లక్ష 47 వేల ఎకరాలలో పత్తి పంట సాగు చేయగా సుమారుగా 10 లక్షల క్వింటాల్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
పత్తి కొనుగోల్ల ప్రారంభానికి ముందే జిన్నింగ్ మిల్లులలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలనీ ఆదేశించారు. సిసిఐ ద్వారా పత్తి పంటకు కనీస మద్దతు ధర 7521/- రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు తాము పండించిన పత్తిని 8 శాతం తేమ మించకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని కోరారు. రైతు పండించిన పత్తి పంటకు కచ్చితంగా ఆధార్ నెంబరు కలిగి ఉన్నట్లు రుజువు సమర్పించాలన్నారు. పత్తి కొనుగోళ్లకు రైతుల ఆధార్ ప్రామాణికమని, రైతులందరు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 7 అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి పత్తి మిల్లులలో ముందస్తు తూకం యంత్రాల పని తీరును పరిశీలించుకోవాలని, అగ్ని ప్రమాధాలు జరుగకుండా అగ్ని మాపక శాఖ తనిఖీలు చేయాలనీ సూచించారు. పోలీస్, రవాణా అధికారులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జిన్నింగు మిల్లుల వద్ద తగు ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ పలు సూచనలు చేశారు.
వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 272 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొడ్డు, సన్నరకం ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 20 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, గన్ని బ్యాగులు, టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు.ఈనెల 25 వరకు కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు మార్కెటింగ్ శాఖ కరపత్రాలను జిల్లా కలెక్టర్ అధికారులు, ట్రేడర్ లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మార్కెటింగ్ ఏడి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం వేణుగోపాల్, సి సి ఐ ప్రతినిధులు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, ట్రేడర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
