BKMU: కరీంనగర్, మార్చి 15 (మన బలగం): కరీంనగర్ కార్పొరేషన్ విలీన గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని బీకేఎంయూ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చింతకుంట, బొమ్మకల్, మల్కాపూర్, కొత్తపల్లి, గోపాలపూర్ గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను నిలిపి వేయడం వల్ల వేలాది మంది ఉపాధి హామీ కూలీలు పనికి దూరం అయి బతుకు భారంగా మారిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడం ద్వారా అభివృద్ధి జరుగదని, ఆయా ప్రజల జీవన విధానంలో మార్పు రావడం, వారికి ఆర్థిక పరిపుష్టి కలుగడం ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. కార్పొరేషన్లో విలీనం కావడం వల్ల అన్ని రకాల పన్నులు పెరుగడం తప్పు ప్రజలకు ఒరిగేది ఏమిలేదని అన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన వేలాది మంది కూలీలు పనులను తీసివేయడం వల్ల ఆయా కుటుంబాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాడానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కూలీలలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సృజన్ కుమార్ హెచ్చరించారు.