International Yoga Day: నిర్మల్, జూన్ 21 (మన బలగం): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడారపు పరమేశ్వర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శనివారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన భారత ప్రాచీన కాలం నుంచి మన జీవన విధానాలలో యోగా ఒక భాగంగా ఉందన్నారు. యోగా పితామహుడుగా పిలువబడుతున్న మన దేశానికి చెందిన యోగి పతాంజలి మహర్షి అనేక యోగా నియమాలను రూపొందించారని వివరించారు. యోగాతో శారీరక ఆరోగ్యం మెరుగుపరచడంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఈ యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతున్నదని అన్నారు. యోగాతో ఒత్తడి తగ్గి మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతుందని వివరించారు. యోగ మనిషిని మానసికంగా శక్తిమంతులుగా చేయడంతోపాటు చురుకుగా ఉంచుతుందని అన్నారు. యోగా వల్ల శారీరక, మానసిక రుగ్మతలు మటుమాయమవుతాయని పేర్కొన్నారు. యోగాలో భాగమైన ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంలాంటి ప్రక్రియలను విద్యార్థులు ప్రతి రోజూ చేయాలని, దీంతో మానసిక బుద్ధి వికాసం చెంది చదువులలో రాణిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటి ప్రక్రియలను చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సతీశ్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.