అబ్బుర పరిచిన చిన్నారుల యోగా విన్యాసాలు
International Yoga Day: నిర్మల్, జూన్ 21 (మన బలగం): జిల్లా ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జూమ్ ద్వారా పాల్గొని మాట్లాడారు. ప్రతి రోజూ కనీసం 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. యోగా సాధన ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం చేశారు. అనంతరం యోగా ప్రదర్శనలతోపాటు విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశుమందిర్ విద్యార్థి రామ్ కుమార్ మ్యాన్ కోడ్ ప్రక్రియ ద్వారా కళ్లకు గంతలు కట్టుకొని వస్తువులను గుర్తించిన విధానం విశేషంగా ప్రశంసలు అందుకుంది.
కఠోర సాధనతో ఇలా సాధ్యమవుతుందని యోగా శిక్షకులు తెలిపారు. రామ్ కుమార్ను అదనపు కలెక్టర్ శాలువాతో సన్మానించి బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశం ద్వారా యోగా విశ్వవ్యాప్తమైందని, అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం దేశానికి గర్వకారణమన్నారు. యోగా సాధన శాంతిని, స్థిరతను అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీవో జీవరత్నం, డీవో పి.రామారావు, డీఎస్వో కిరణ్ కుమార్, డీఎంహెచ్వో రాజేందర్, డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆయుష్ అధికారులు నారాయణ రావు, సంధ్యారాణి, వెంకటేశ్వరులు, శ్రవణ్ కుమార్, ప్రముఖ వైద్యులు రమేశ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణం రాజు, రమేష్, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.