- మత్తుకు బానిసైన యువత
- గాంజా, డ్రగ్స్ బానిసలకు మత్తు సూదుల విక్రయాలు
- మిడజోలం మత్తుమందు బాటిళ్లు స్వాధీనం
- పోలీసుల అదుపులో ముఠా
- ల్యాబ్ టెక్నీషియన్ సూత్రధారి
- రాష్ట్రంలోనే మొదటి కేసు నమోదు
- జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Drug peddlers: నిర్మల్, మే 15(మన బలగం): గంజాయి, డ్రగ్స్, వైట్నర్ ఏదైతే మాకేంటి.. మాకు మత్తు కావాలి అనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా యువత మత్తుకు బానిసైతున్నారు. మత్తుకు బానిస అయిన వారి అవసరాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. మత్తుమందుల వినియోగాన్ని నియంత్రించేందుకు నిర్మల్ పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
మిడజోలం మత్తుసూదుల విక్రయాలు
గంజాయి, డ్రగ్స్, మద్యానికి బానిసైన యువతను గుర్తించి వారికి మిడజోలం(Midazolam) మత్తుసూదులను విక్రయించే ముఠా(Drug peddlers)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్లు చేసే సమయంలో ఇచ్చే మిడజోలం మత్తు సూదులను మత్తుకు బానిసైన యువకులకు ఇస్తున్నారు. ఈ సూదులను అనస్తీషియా వైద్యులు మాత్రమే వేస్తారు. కానీ యూట్యూబ్ ఆధారంగా మత్తు సూదులను ఎలా ఇవ్వాలో చూసి మత్తుకు బానిసైన యువకులకు ఈ ముఠా మత్తు సూదులు ఇస్తున్నారు.
ముఠాలో ల్యాబ్ టెక్నీషియన్ సూత్రధారి
మత్తుసూదులను వేసేందుకు ఏర్పాటైన ముఠాలో ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician)షేక్ ఫర్దిన్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. మందుల వినియోగంపై కొద్దిపాటి అవగాహన ఉండడంతో యూట్యూబ్ ఆధారంగా మత్తు సూదులు ఎలా వేయాలో నేర్చుకొని అనేక మంది యువకులకు సూదులను వేస్తున్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని బైల్బజార్ ప్రాంతంలో మత్తుసూదులను వేసేందుకు వచ్చిన వీరిని నిర్మల్ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నలుగురి అరెస్ట్
మిడజోలం మత్తుసూదులను విక్రయిస్తున్న ముఠాలో నలుగురు వ్యక్తులను నిర్మల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో షేక్ ఫర్దిన్, ఫర్వేజ్, చౌహాన్ గోవింద, మహమ్మద్ అబ్దుల్ డానీష్ అనే నేరస్తులు ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుదామనే ఉద్దేశంతో మిడజొలం అనే ఇంజక్ష ను యువకులకు అలువాటు చేసి వారిని మత్తుకు బానిస చేస్తున్నారు. షేక్ ఫర్దిన్ ల్యాబ్ టెక్నిషియన్గా మూడేళ్లుగా పనిచేశాడు. తనకు మెడిసిన్ గురుంచి అవగాహన ఉంది. యూట్యూబ్లో మిడజోలం ఇంజక్షన్ ఓలా తీసుకుంటారో, అది తీసుకోవడం వలన ఏమి జరుగుతోందొ తెలుసుకొని దాని గురించి తన స్నేహితులైన ఫర్వేజ్, చౌహాన్ గోవింద, మహమ్మద్ అబ్దుల్ డానీష్లకు తెలుపగా వారు ఈ ఇంజక్షన్ వ్యాపారానికి ఒప్పుకున్నారు. షేఖ్ ఫర్దిన్, ఫర్వేజ్, చౌహాన్ గోవింద మరియు మహమ్మద్ అబ్దుల్ డానీష్ సంవత్సరం నుంచి ఈ ఇంజక్షన్ గురించి గంజాయి తాగే వారికి తెలిపి, ఇది గంజాయి కంటే ఎక్కువ మత్తుని ఇస్తుందని ఈ ఇంజక్షన్ను తామే ఇస్తామని యువతను నమ్మబలికి మరియు అలవాటు చేసి ఈ ఇంజక్షన్ ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇంజక్షన్ ఇవ్వడం చట్టరీత్యా నేరం అని తెలిసి, అది మనషులకు హాని కలిగిస్తుంది అని తెలిసి, ఎవరికి తెలువకుండా నిర్మల్లోని బైల్ బజార్ దగ్గర ఈ ఇంజక్షన్లను యువకులకు ఇచ్చేవారు. నలుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి 26 మిడజోలం ఇంజక్షన్లను, 10 సిరంజీలను, 4 సెల్ ఫోన్లను జప్తు చేసి రిమాండ్కు తరలించారు.
రాష్ట్రంలో మొదటి కేసు
మత్తుకు బానిసైన యువకులకు మిడజోలం ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును నిర్మల్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. మత్తు కోసం మిడజోలం ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ తదితర కేసులు నమోదైనప్పటికీ మత్తు సూదులను విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులకు ఎస్పీ ప్రశంసలు
కేసులో చురుగ్గా పనిచేసిన ఏఎస్పీ రాజేశ్ మీన, పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేష్, కానిస్టేబుల్ సాయి, నవీన్లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అభినందించారు.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే మందులు విక్రయించాలి: ఎస్పీ
మెడికల్ షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికే మందులను విక్రయించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. మత్తు ఇంజక్షన్లను మెడికల్ షాప్ వారు ప్రెస్కిషన్ లేకుండా ఇవ్వరాదని, ఆసుపత్రుల వైద్యులు వాడేసిన మందు బాటిల్ ధ్వంసం చేయాలని అన్నారు. ఆసుపత్రులు, మెడికల్ యాజమాన్యాలు మత్తు మందుల వివరాలను రిజిస్టర్లలో మెయింటైన్ చేయాలని ఎస్పీ సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 8712659599 సెల్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని అన్నారు.
