local election
local election

local election: స్థానిక ఎన్నికల విధుల కేటాయింపులో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల ఇష్టారాజ్యం

  • నాలుగు నెలల సర్వీస్ కూడా నిండని టీచర్లకు రిటర్నింగ్ ఆఫీసర్ విధులు
  • పాతికేళ్ల సర్వీస్ ఉన్న టీచర్లకు మొండిచేయి
  • సింగిల్ టీచర్లకూ డ్యూటీలు
  • పాఠశాలలు నడిచేదెలా?
  • కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని డామేజ్ చేసే కుట్ర?

local election: మనబలగం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేసి, డామేజ్ చేసే కుట్ర జరుగుతోందా? రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల వింత, విచిత్ర ధోరణి గమనిస్తే.. నిజమే అనే సమాధానం లభిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గత ప్రభుత్వ సారథి కొడుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో జిల్లా అధికారుల పనితీరు పరిశీలిస్తే.. ప్రభుత్వంపై ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం సైతం నిర్వహించారు. అయితే.. జిల్లాస్థాయిలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా.. ఉపాధ్యాయులకు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్ఓ) విధులు కేటాయించారు. అయితే, పాతికేళ్ల సర్వీస్ ఉన్నవారిని కాదని, నాలుగు నెలల సర్వీస్ కూడా లేని కొత్త ఉపాధ్యాయులకు ఏఆర్ఓ విధులు కేటాయించడమే ఇక్కడ గమనార్హం. క్లస్టర్ లెవల్‌లో ఎన్నికల ప్రకటన, నామినేషన్ల స్వీకరణ, విత్‌డ్రాలు లాంటి కీలకమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

తమ సర్వీస్‌లో ఎన్నో అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలను సమర్థవంతంగా నిర్వర్తించిన సీనియర్ ఉపాధ్యాయులను కాదని, కొత్త ఉపాధ్యాయులకు ఏఆర్ఓ విధులను కేటాయించి, అందుకు తగిన శిక్షణకు సైతం ఏర్పాట్లు చేయడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు. క్యాడర్ పరంగా, సీనియారిటీ పరంగా.. ఎన్నికల విధులు కేటాయించాలని గట్టిగా నిలదీసే.. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లాంటి ఉపాధ్యాయ సంఘాలు మొత్తుకుంటున్నా.. జిల్లా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. నూతనంగా నాలుగు నెలల క్రితమే నియామకం అయిన కొత్త ఉపాధ్యాయులకు ఏఆర్ఓ విధులు కేటాయించడమే జిల్లా స్థాయి అధికారుల అత్యుత్సాహం అనుకుంటే.. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు సైతం.. విధులు కేటాయించడం మరీ దారుణం. దాదాపు వారం రోజులపాటు ఆ ఉపాధ్యాయులు ఎలక్షన్ విధులకు వెళితే ఆయా పాఠశాలలు మూత పడాల్సిందే. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్న కొంత మంది అధికారుల వ్యవహార శైలి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు కారణం ఎవరనేది పంచాయతీరాజ్ అధికారులు సమాధానం చెబుతారా లేక వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూస్తున్న విద్యా శాఖ అధికారులు సమర్థించుకుంటారా వేచి చూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *