- వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మరమ్మతులు చేయాలి
- పార్కు చుట్టూ ప్రహరీ ఏర్పాటు
- కాలనీలో దశలవారీగా సమస్యలను పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
Collector Abhilasha Abhinav: నిర్మల్, మన బలగం: నిర్మల్ పట్టణంలోనే విశాలమైన పార్కు స్థలం కలిగి ఉన్న ఏకైక ప్రాంతం దివ్యనగర్ అని దీనిని పూర్తి వినియోగంలోకి తెచ్చే విధంగా 15 రోజుల్లో పార్కు అభివృద్ధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి జిల్లా కలెక్టర్ దివ్య నగర్ పట్టణంలోని పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కు ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. పార్కులో వాకింగ్ ట్రాక్, వాటర్ ఫౌంటెన్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట సామగ్రి మొత్తాన్ని మరమ్మతులు చేసి పూర్తి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అదేవిధంగా జూన్ మొదటి వారంలో పార్కులో అవసరమైన అన్ని రకాల మొక్కలను నాటి పచ్చదనంతో కళకళలాడే విధంగా తీర్చేదిద్దాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఇతరులు ఎవరు పార్కులోనికి రాత్రి వేళల్లో రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కులో సాయంత్రం వేళల్లో పర్యాటకులు సందర్శించే విధంగా సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కాలనీ తరఫున పార్కు పర్యవేక్షణ కోసం వాచ్మన్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కాలనీ తరఫున వాచ్మన్ను ఏర్పాటు చేస్తామని కాలనీవాసులు హామీ ఇచ్చారు. జూన్ మొదటి వారంలో మళ్లీ వస్తానని అప్పటివరకు తనకు పార్కు పనుల్లో పురోగతి కనిపించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాలనీ సమస్యలపై నివేదిక ఇవ్వండి
కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. ప్రధానంగా కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యపై అంచనాలు తయారు చేసి తనకు అందజేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా అదనప కలెక్టర్ ఫైజా అహ్మద్ అన్నారు. డ్రైనేజీలో ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని జిల్లా అదనపు కలెక్టర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ ఆఫీసర్ లతో పాటు కాలనీ అధ్యక్షులు పురస్తు శంకర్, నాయకులు నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రాజన్న, జుట్టు లక్మణ్, సాయినాథ్, రాందాస్, శ్రీనివాస్ చారి, సతీశ్ రెడ్డి, కిష్టయ్య, రామ కృష్ణ తదితరులు ఉన్నారు.
