MLA Adluri Laxman Kumar: ధర్మపురి, ఫిబ్రవరి 14 (మన బలగం): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మె్ల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో సమావేశం నిర్వహించారు. పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధర్మపురి నియోజకవర్గ పట్టభద్రులు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి విద్య పట్ల, ఉద్యోగుల పట్ల అనుభవం ఉన్న వ్యక్తి అని, కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.