- ఆలయంలో అనధికార విక్రయాలు
- రోజూ వేలల్లో నష్టం
- నెలరోజులుగా ఇదే తంతు
Donga Mallanna Swamy temple: జగిత్యాల, డిసెంబర్ 30 (మన బలగం): మల్లన్న పేటలోని దొంగ మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలను కల్పించిన అధికారులు, పాలకవర్గం ఆలయంలోనే అనధికారికంగా గండ దీపం ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోక విమర్శలపాలవుతున్న సంఘటన ఇది. డిసెంబర్ 1 నుంచి సట్టి రావడంతోనే నెలరోజులపాటు మల్లన్న పేటలోని దొంగ మల్లన్న స్వామి ఆలయంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి లక్షలాదిగా తరలివస్తారు. ఇలా వచ్చే భక్తులకు అసౌకర్యాలు జరుగకుండా ఆలయ అధికారులు, పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆదాయ సముపార్జన కోసం కొబ్బరికాయ, పులిహోర, గండ దీపంతోపాటు మరికొన్నింటికి టెండర్లు పిలిచి అప్పగిస్తుంది. ఇలా పిలిచినా వాటిల్లో గండ దీపంలో నూనె పోసేందుకు వచ్చే భక్తులకు పది రూపాయల టిక్కెట్ పెట్టి నూనె పోసే ఏర్పాట్లు జరిగాయి. ఇలా ఆలయానికి ఆదాయం వచ్చే ఈ దారిలోనే కొందరి మూలంగా గండ దీప ఆదాయానికి గండి కొట్టే పనులను నెలరోజులుగా సాగిస్తున్నారు. పాలకవర్గం, అధికారుల అనుమతులు లేకుండానే ఇద్దరు మహిళలను అక్కడ కూర్చోబెట్టి 10 రూపాయలకు నూనె విక్రయిస్తూ దేవునిపై నూనె పోయిస్తున్నారు. ఇలా రోజుకు వందలాది మందికి నూనె విక్రయిస్తూ వేలల్లో సొమ్ము చేసుకొంటున్నా పట్టించుకొనే వారే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల రోజులుగా ఇదే రీతిలో అక్రమంగా నూనె విక్రయిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకొంటుండగా పాలకవర్గం, ఆలయ అధికారులు ప్రశ్నించిన దాఖలాలు కరువని పలువురు అంటున్నారు. గత ఏడాది గండ దీపం ఆదాయానికి గండి కొట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గండ దీపం ఆదాయాన్ని గండి కొట్టడాన్ని అరికట్టాలని, ఆలయ ఆదాయాన్ని పెంచాలని భక్తులు కోరుతున్నారు.