Gram Sabha
Gram Sabha

Gram Sabha: గ్రామ సభల్లో అధికారుల నిలదీత: వర్షకొండలో గందరగోళం

Gram Sabha: ఇబ్రహీంపట్నం, జనవరి 22( మన బలగం): ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల్లో రెండో రోజు బుధవారం గందరగోళం నెలకొంది. ఎన్ని సార్లు దరఖాస్తు తీసుకుంటారని కొందరు, ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని మరికొందరు ఇలా అడుగడుగునా అధికారులకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఇబ్రహీంపట్నం తహశీల్దార్ ప్రసాద్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. కాగా కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధి కోసం ఒక్కసారిగా ప్రజలు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బాయి లింగా రెడ్డి గర్జించేంత పనిచేశారు. గత ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు. మళ్లీ, మళ్లీ ఇలా ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. పలువురు గత ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు రసీదులను చూపుతూ గ్రామసభకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవడం తప్ప తామేమి చేయలేమని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నాయకులు గ్రామ సభలకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారు. గ్రామసభలకు వెళ్తే గతంలో ఇచ్చిన దరఖాస్తుల మాటేమిటి, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని నిలదీస్తారనే భావన అధికార నేతలను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న గ్రామ సభలలో భాగంగా పలు గ్రామాల్లో జరిగిన సభలకు అధికార పార్టీ ముఖ్యనేతలు హాజరుకాకపోవడం అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. దాదాపు గంట పాటు గందరగోళ పరిస్థితి నెలకొంది.
మూడు గ్రామాల్లో సభలు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ, మూలరాంపూర్, కేశాపూర్ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం తహశీల్దార్ ప్రసాద్, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. రేషన్ కార్డుల ముసాయిదా జాబితాను ప్రదర్శించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వయాగ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *