Sadak Suraksha Abhiyan: ఎల్లారెడ్డిపేట, జనవరి 22 (మన బలగం): మైనర్లకు వాహనాలు ఇచ్చి వారు ప్రమాదాలకు కారణం అయితే వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ అన్నారు. జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం (సడక్ సురక్షా అభియాన్)ను పురస్కరించుకొని బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీ ఆటలో నియమ నిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు చాలా నిబంధనలు ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ టిఐడిఇస్ రాజన్న సిరిసిల్ల ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్లొని డ్రైవింగ్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, నియమాలు శిక్షల గురించి తెలిపారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిదప ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని, లైసెన్స్ పొందిన తరువాతనే డ్రైవింగ్ చేయాలని సూచించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీదర్ మాట్లాడుతూ పాఠశాల వాహనాల డ్రైవర్లకు బస్సు నడిపే సమయాల్లో తప్పకుండా సహాయక వ్యక్తి ఆధ్వర్యంలో బస్సు నడపాలని, తాగి డ్రైవింగ్ చేయొద్దని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడుపొద్దని సూచించారు. అనంతరం పిల్లలందరికి పండ్లు పంపిణీ చేశారు. ఆరువందల మంది విద్యార్థులతో పటు స్కౌట్ విద్యార్థులతో భారీ ప్రమాదాలు నివారించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సహాయక మోటారు వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ వాహనములు నడపమని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.