Indiramma’s houses: ధర్మారం, మార్చి 7 (మన బలగం): ప్రజాపాలనలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన ధర్మారం మండలం బంజేరుపల్లి తండా (బి) గ్రామంలో మంజూరు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను కట్టించే ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. ఇండ్ల నిర్మాణం విషయంలో అవినీతికి తావు లేకుండా విడతల వారీగా డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి బోర్వెల్ అవసరం ఉందని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే తన ఏసీడీపీ నిధుల నుంచి ఒక బోర్వెల్ మంజూరు చేసి 2 రోజుల్లో బోర్ వేయించడం జరుగుతుందని తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ వారికి రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. సన్న వడ్ల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.