Koppula Ishwar House arreste: ధర్మపురి, నవంబర్ 30 (మన బలగం): మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చొప్పదండి, మల్లాపూర్, అల్లీపూర్, ధర్మపురి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు కరీంనగర్ నుంచి చొప్పదండి వైపు వెళ్తు్న్న ఆయనను అరెస్ట్ చేసారు. కరీంనగర్ శ్రీపురం కాలనీలో ఆయన ఇంటికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. 11 నెలల్లోనే 50 మంది విద్యార్థులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో శైలజ అనే విద్యార్థిని కలుషిత ఆహారం తిని 21 రోజులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కేసీఆర్ నాయకత్వంలో 11 వందల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి, అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాల వ్యవస్థను చిన్నా భిన్నం చేయడానికి కంకణం కట్టుకుంది. గురుకులాల్లో నాణ్యమైన భోజనం, విద్య అందక విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు. పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. బడ్జెట్ను త్వరగా విడుదల చేసి, డైట్ చార్జీలను పెంచి, ఫుడ్ నియమాలను సవరించి, ఉన్నతాధికారులతో కమిటీ వేసి, నివేదికను తెప్పించుకొని సరిచేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రుక్మాపూర్, చొప్పదండి, మల్లాపూర్, అల్లీపూర్, ధర్మపురి మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించాం. మార్గ మధ్యలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.’ అని తెలిపారు.