Nirmal District Collector Abhilash Abhinav: నిర్మల్, జనవరి 27 (మన బలగం): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున, ప్రత్యేకాధికారులంతా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, పదవతరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాల వివరాలను అందజేయాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులందరూ ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది శనివారాలు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మండలాల్లో పిహెచ్సిలు, సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
