Vegetable Rates Hike
Vegetable Rates Hike

Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా

  • చికెన్‌తో పోటీపడుతున్న బీన్స్
  • కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిగడ్డలు
  • రూ.500లకు తగ్గని వెల్లుల్లి
  • బీట్ రూట్ కేజీ రూ.250
  • తగ్గేదేలే అంటున్న క్యాబేజీ, క్యాలిఫ్లవర్, క్యాప్సికమ్
  • సామాన్యుడిపై ధరాఘాతం

Tomato Price: టమాటా కొందామంటే నోట మాట రానీయడంలేదు.. ఉల్లిపాయ కన్నీరు పెట్టిస్తోంది.. వెల్లుల్లి వెక్కిరిస్తోంది.. బెండకాయ మిడిసిపడుతోంది.. బీరకాయ బీరాలు పోతోంది.. బీన్స్ నేను కింగ్ అంటోంది.. బీట్ రూట్ తన రూటే సెపరేట్ అంటోంది.. కొత్తిమీరా తనను చులకనగా చూడద్దొంటోంది.. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యాలిఫ్లవర్, ఆలు సైతం తగ్గేదేలే అంటున్నాయి.. ఇలా ఒక్కటేంటి అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పక్షం రోజుల్లోనే కూరగాయల ధరలు నాలుగింతలయ్యాయి. ధరాఘాతంతో సమాన్యులు విలవిల్లాడుతున్నారు. ఏం కొనేటట్లు లేదు.. ఏం తీనేటట్లు లేదు అంటూ వాపోతున్నారు.

కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత సీజన్‌ను మళ్లీ గుర్తుచేస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా కిలో సెంచరీ మార్క్ దాటింది. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. నిన్నా మొన్నటి వరకు రూ.20 కిలో ఉన్న ఉల్లిగడ్డలు ప్రస్తుతం రూ.60 దాటింది. బీన్స్ అయితే చికెన్‌తో పోటీ పడుతోంది. రూ.260 కిలో పలుకుతోంది. బీట్ రూట్ సైతం రూ.250 కేజీ విక్రయిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు భైంసా మార్కెట్‌లో మంగళవారం టమాటా కిలో క్వాలిటీని బట్టి రూ.70 నుంచి రూ.110 వరకు విక్రయించారు.

దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో టమాటాతోపాటు ఇతర కూరగాయల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. ఇతర రాష్ర్టాల్లోని మార్కెట్ల పరిధిలో కూరగాయలు మార్కెట్‌కు రావడం తగ్గింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. రైతుల నుంచి వ్యాపారులు 25 కిలోల టమాటా ట్రేను రూ.మూడు వేల నుంచి 3500 వరకు కొంటున్నారు. టమాటాతోపాటు మిర్చి, ఉల్లిగడ్డలతోపాటు ఇతర కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. టమాటాతో ఉల్లి పోటీ పడుతోంది. టమాటా కిలో రూ.100 వాటితే ఉల్లిగడ్డలు సైతం అదే దారిలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.70 కిలో విక్రయిస్తున్నారు. రెండో రకం ఉల్లిగడ్డలు రూ.100కు రెండు కిలోలు అమ్ముతున్నారు. మే మూడో వారంలో రూ.20 కిలో ఉన్న ఉల్లి ప్రస్తుతం నాలుగింతలైంది.

తెలంగాణలో ప్రతి ఏటా 40 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. కానీ ఇక్కడ ఉత్పత్తి అయ్యేది అందులో సగమే. మిగతా కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిందే. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోవడం ధరల పెరుగులకు ఒక కారణం. చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవని బోర్డులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పక్కనే ఉన్న మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చే కూరగాయల సరఫరా సగానికి తగ్గింది. దీంతో మన రాష్ర్టంలో ధరలు చుక్కలనంటాయి. నిత్యావసర సరుకుల ధరలు సైతం అమాతం పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

పాలకూర కేజీ రూ.120కి చేరింది. కొత్తిమీర కిలో రూ.300 వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి రూ.200లకు చేరువైంది. ఇంటిల్లిపాదికి కిలో కూరగాయలు కొనేవారు పావు, అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఈదరుగాలులు, అకాల వర్షాలతో పంటలు పాడైపోయినట్లు తెలుస్తోంది. మహారాష్ర్ట నుంచి వచ్చే టమాటా రాకపోవడం, ఇక్కడ అవసరం మేర ఉత్పత్తి లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఇవే ధరలు కంటిన్యూ కానున్నట్లు తెలుస్తోంది. వర్షాలు పడేవరకు పరిస్థితి ఇలా ఉంటుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. క్యారెట్, క్యాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజీ తదితర కూరగాయల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. పచ్చడి, కోడిగుడ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. పప్పులు, నేనె ధరలు సైతం విపరీతంగా పెరిగాయి.

Vegetables Rates Today
Vegetables Rates Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *