Distribution of bags: నిర్మల్, మార్చి 22 (మన బలగం): విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశనుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. మామడ మండలం దిమ్మదుర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విజయ్ కుమార్ రెడ్డి నరేష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగులు పంపిణీ చేశారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తరగతిగదుల్లోనే నిర్మాణమవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు మండల పార్టీ అధ్యక్షులు బూజంగా శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పడాల శ్రీనివాస్ రెడ్డి, కారిటికల్ మాజీ సర్పంచ్ నల్ల లింగారెడ్డి, మాజీ సర్పంచులు సుంకరి రత్నయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.